న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2,600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే ‘హరిభాంగా’ రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ఆ దేశ లారీల్లో రవాణా చేశారు. ఆ వాహనాలు బెనాపోల్ చెక్ పాయింట్ ద్వారా ఆదివారం సరిహద్దును దాటి కోల్కతా చేరాయి. కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ మొదటి కార్యదర్శి మహ్మద్ సమిల్ క్వాడర్ ఈ మామిడి పండ్ల బాక్సులను స్వీకరించారు. కస్టమ్స్ ఫార్మాలిటీల అనంతరం ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతకు వీటిని పంపనున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహానికి చిహ్నంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ మామిడి పండ్లను ప్రధాని మోదీ, సీఎం మమతకు బహుమతిగా పంపారని బెనాపోల్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అనుపమ్ చక్మా తెలిపారు. కాగా, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మామిడి పండ్లను పంపే యోచనలో షేక్ హసీనా ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.