Barren lands | వారణాసి: దేశంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గాజుతో తయారుచేసిన ఎరువులతో బంజరు భూముల్లో పంటలు పండించే అవకాశం ఉంటుందని సిరామిక్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే చతుర్వేది తెలిపారు.
గాజు 19 మూలకాలతో తయారవుతుందని, ఆ మూలకాలు బంజరు భూముల్లో పంటలకు అవసరమైన మృత్తికలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతాయని చెప్పారు. గాజులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్, నికెల్, కోబాల్ట్, ఆర్గానిక్ కార్బన్, మాలిబ్డినం, వనడియం, క్లోరిన్, బోరాన్, సిలికా మూలకాలుంటాయి. ఈ మూలకాలతో కూడిన గాజును ఉపయోగించి ఎరువులు తయారుచేస్తే దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న భూముల్లోనూ బంగారు పంటలు పండించవచ్చని చతుర్వేది పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులను మానేసి, గాజుతో తయారైన సిరామిక్ ఎరువులను వాడితే అనేక లాభాలుంటాయని చెప్పారు. సిరామిక్ ఎరువులను రెండుమూడేండ్లకు ఒకసారి వాడితే సరిపోతుందన్నారు.