న్యూఢిల్లీ: అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది. అలా కాని పక్షంలో స్థానాలు ఖాళీ చేసి బలవంతంగా ఉప ఎన్నికలకు దారి తీసే అభ్యర్థులకు భారీగా జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. రెండు దశాబ్ధాల నాటి ప్రతిపాదనను ఈసీ మరోసారి తెరపైకి తెచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖలోని శాసనసభ కార్యదర్శితో సమావేశమయ్యారు. 2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ప్రతిపాదన చేశారు.
కాగా, ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయవచ్చు. ఆ అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకుని, మిగతా స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలా ఖాళీ అయిన ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 1996లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు.
ఈ నేపథ్యంలో 2004లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్ల సవరణను ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదని సూచించింది. ఒక వేళ ఈ సవరణ చేయకపోతే ఉప ఎన్నికలకు దారి తీసిన అభ్యర్థి సంబంధిత వ్యయం భరించేలా చేయాలని ప్రతిపాదించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 లక్షలు, లోక్సభ నియోజకవర్గానికి రూ.10 లక్షల మేర జరిమానా విధించాలని సూచించింది.