న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్షోలపై ఈసీ నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ర్యాలీలు, రోడ్షోలపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఇండోర్ సభల్లో 50 శాతం సీటింగ్కు అనుమతించిన ఈసీ.. 300 మందికి మించరాదని సూచించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈసీ ఆదేశించింది. జనవరి 15వ తేదీ వరకు ఉన్న ఆంక్షలను 22వ తేదీ వరకు పొడిగించింది. ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశమై ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.