న్యూఢిల్లీ, జూలై 25: ‘దేశంలో హానికర క్రిమిసంహారాలు, ఎరువుల వాడకంపై నిషేధం విధించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కమిటీలపై కమిటీలను ఎందుకు నియమించుకుంటూపోతున్నారు’ అని కేంద్రాన్ని మంగళవారం సుప్రీం కోర్టు నిలదీసింది. మీరు నియమించిన ఏదో ఒక కమిటీ మీకు అనుకూలంగా సిఫార్సు చేసే వరకు ఇలా చేసుకుంటూనే పోతారా? అని ప్రశ్నించింది.
27 ప్రమాదకరమైన పురుగుమందులు, ఎరువుల వాడకం కారణంగా రైతులు, కూలీలు నిత్యం తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని 2018 నాటికే వీటిని నిషేధించాల్సి ఉన్నా ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నదని వనశక్తి ఎన్జీవో సహా పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కమిటీల నివేదికల్లో తేడా ఎందుకు ఉందని ప్రశ్నించింది.