చండీగఢ్, ఆగస్టు 9: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల తలెత్తిన మత కల్లోలాలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగాయనుకుంటే కొన్ని గ్రామాలలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హర్యానాలోని కొన్ని గ్రామాల్లో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ పంచాయతీ సర్పంచ్ల పేరిట లేఖలు రావడం సంచలనం సృష్టించింది. మహేంద్రగర్, రేవారి, జాజ్జర్ జిల్లాలలోని కొన్ని గ్రామాలలో పంచాయతీ సర్పంచ్ల పేరున ఈ మేరకు లేఖలు వచ్చినట్టు ఆన్లైన్లో ప్రచారం జరుగుతున్నది. ఈ లేఖలను కొంతమంది సర్పంచ్లు సంబంధిత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లకు పంపి ఉండవచ్చని భావిస్తుండగా, తమకు అలాంటి లేఖలేవి రాలేదని ఎస్డీఎంలు, తాము కూడా ఎలాంటి లేఖలు పంపలేదని సర్పంచ్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో గ్రామాలలో అశాంతి సృష్టించడానికి కొన్ని అరాచక శక్తులు ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.