Election Comission | ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భౌతిక ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా విముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. రోడ్షోలు, సభలు, సమావేశాలపై మరో వారం పాటు ఆంక్షలను పొడిగించినట్లు సమాచారం. కరోనా కేసుల దృష్ట్యా భౌతికంగా ప్రచారం నిర్వహించడంపై ఈసీ ఆంక్షలను కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఇండోర్ సమావేశాలకు మాత్రం అనుమతినిచ్చింది. 50 శాతం కెపాసిటీతో ఇండోర్ సమావేశాలు నిర్వహించుకోవచ్చని మాత్రం తెలిపింది. ఇప్పటికే భౌతిక ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జనవరి15 వరకూ మొదట ఈసీ బ్యాన్ విధించింది. ఆ తర్వాత దానిని 22 తేదీ వరకూ పొడిగించారు.
ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల రాష్ట్రాల ఆరోగ్య అధికారులు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో శనివారం భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా భౌతిక ప్రచారానికి ఈసీ అంత సుముఖంగా లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయితే మిగతా ప్రచార రీతుల్లో కాస్త సడలింపులు ఇచ్చే ఛాన్స్ మాత్రం వుందంటున్నాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అధికారులు ఈసీకి నివేదించారు. భౌతికంగా ప్రచారం నిర్వహించాలా? వద్దా? అన్న దానిపైనే ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చే జరిగింది.