న్యూఢిల్లీ: జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఇవి ప్రతికూల ప్రభావం చూపుతాయనే నిరాధారమైన భయాలు పరిశ్రమ, రైతులు, వినియోగదారులను దెబ్బతీస్తాయని చెప్పింది. కోరుకున్న లక్షణాలతో కూడిన నూతన వంగడాలను సృష్టించగలిగే కార్యక్రమాలను పటిష్టపరచవలసిన అవసరం చాలా ఉందని చెప్పింది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, మన దేశ వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు నూతన జన్యుపరమైన సాంకేతిక పరిజ్ఞానాలు అవసరమని తెలిపింది.