అహ్మదాబాద్, ఆగస్టు 9: ఇకపై సమాచార హక్కు దరఖాస్తు దాఖలు చేయకుండా గుజరాత్లో 10 మందిపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు గుజరాత్ సమాచార కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఒకరిపై రూ.5 వేల జరిమానా కూడా వేసింది. ఆర్టీఐ దరఖాస్తు చేసినందుకు ఈ విధంగా ఫైన్వేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీరంతా ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారని, పదేపదే దరఖాస్తులు చేస్తున్నారని.. అందుకే భవిష్యత్తులో ఆర్టీఐ పిటిషన్లు పెట్టకుండా బ్యాన్ విధించామని చెప్పుకొచ్చింది.
దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వొద్దు!
తాజా ఘటనపై ఆర్టీఐ హెల్ప్లైన్ను నడిపే, ఆర్టీఐ అప్లికేషన్లు, సమాధానాలను అధ్యయనం చేసే మహితి అధికార్ గుజరాత్ పహేల్ అనే ఎన్జీవో ఈ పది కేసులను విశ్లేషించింది. దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వొద్దని సమాచార కమిషనర్లు సంబంధిత అధికారులను ఆదేశించినట్టు గుర్తించింది. గాంధీనగర్ జిల్లా పెథాపూర్కు చెందిన అమిత మిశ్రా అనే టీచర్ తన సర్వీస్ బుక్ కాపీ, వేతన వివరాల కోసం దరఖాస్తు చేశారు. ఆమె దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సమాచార కమిషనర్ కేఎం అధ్వర్యు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఆర్టీఐ ఫీజు చెల్లించలేదని, అదే ప్రశ్నలు అడుగుతున్నారని పాఠశాల అధికారులు అమిత మిశ్రాపై ఫిర్యాదు చేశారు. తమ రెసిడెన్షియల్ సొసైటీపై 13 ఆర్టీఐ దరఖాస్తులు వేసిన హిమేష్ పటేల్పై రూ.5 వేల ఫైన్ వేశారు. తనపై చర్యలు తీసుకున్న విద్యాసంస్థపై ఆర్టీఐ పిటిషన్లు పెట్టకుండా సత్తార్ ఖలీఫా అనే వ్యక్తిపై జీవితకాల నిషేధం విధించారు.