బెంగళూరు: హిజాబ్ వివాదం కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి బజరంగ్దళ్కు చెందిన ఓ కార్యకర్త దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతున్నది. హర్ష (23) అనే బజరంగ్ దల్ కార్యకర్త ఆదివారం అర్ధరాత్రి (తెల్లవారితే సోమవారం) హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని భారతీకాలనీ రవివర్మ లేన్లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్యచేశారు.
అయితే, ఇప్పటికే రెండు వర్గాల మధ్య హిజాబ్ వివాదం కొనసాగుతుండటంతో ఈ హత్య ఉద్రిక్తతలకు దారితీసింది. హత్య విషయం తెలియగానే హర్ష మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మూసివున్న దుకాణాలు, పార్క్చేసి ఉన్న వాహనాలపైకి రాళ్లు రువ్వారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పట్టణమంతటా నిషేదాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. జనం గుంపులుగా బయటికి రాకుండా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా ఇవాళ పట్టణంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే, ఈ హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు.