న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాలను తరుచూ విమర్శించే బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ‘పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నామంటూ జబ్బలు చర్చుకుంటున్నారు సరే.. మరి మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్ వంటి ఆర్థిక నేరగాళ్లకు చెందిన దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు కదా.. దీని సంగతేంటి.. చెప్పండి’ అని నిలదీశారు. ఇటీవల లోక్సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న మోదీ సర్కార్ను మనమంతా అభినందించాల్సిందేనని అన్నారు. దీనిపై వరుణ్గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యంగా విమర్శలు సంధించారు.
మీకో న్యాయం.. విపక్షాలకో న్యాయమా?
‘కొద్దికాలం కిందట ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను హామీగా ఇస్తున్నాయి.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని ఆయన అన్నారు. మరి ఇప్పుడు మీరు (నిషికాంత్ దూబే) ఉచితంగా రేషన్ ఇస్తున్నందుకు మోదీ సర్కార్ను అభినందించాలంటున్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మీకో న్యాయం? ఇతర పార్టీలకో న్యాయమా?. బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్ల రుణాలు రూ.10 లక్షల కోట్లను ఎందుకు రద్దు చేశారు? ఈ రద్దు ఉచితం కిందకురాదా? నెలకు 5 కిలోల బియ్యా న్ని ఉచితంగా ఇచ్చినందుకు మోదీ సర్కార్ను అభినందించాలని అంటున్నారు.. మరి ఆర్థిక నేరగాళ్ల రుణాలు రూ.10 లక్షల కోట్లను రద్దు చేసినందుకు పార్లమెంట్లో మోదీజీని సన్మానించాలా? చెప్పండి?’ అని ప్రశ్నించారు.