చెన్నై: దారి తప్పిన ఏనుగు పిల్లను దాని తల్లి వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేర్చారు. తమిళనాడు నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. ఒక ఏనుగు పిల్ల మందను వీడింది. తల్లి కోసం వెదుకుతూ దారి తప్పింది. గమనించిన అటవీ శాఖ సిబ్బంది ఆ ఏనుగు పిల్లకు దారి చూపారు. దీంతో అది ఎంచక్కా వారిని అనుసరించింది. ఒక గుట్టను ఎక్కిన తర్వాత తల్లి ఏనుగును అది చూసింది. దీంతో సంతోషంతో ఘీంకరిస్తూ తల్లి ఏనుగు ఉన్న మంద వద్దకు ఆ పిల్ల ఏనుగు చేరింది.
తమిళనాడు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తమిళనాడు మదుమలైలో ఒక కుట్టి పిల్ల ఏనుగును అటవీశాఖ అధికారులు రక్షించి తల్లితో కలిపారు. ఇది నిజంగా చాలా హృదయపూర్వకంగా ఉన్నది. ఆ అధికారులకు అభినందనలు’ అని ఆమె పేర్కొన్నారు.
‘తల్లిని సమీపించే సమయంలో కుట్టి పెద్దగా ఘీంకరించింది’ అంటూ మరో వీడియోను కూడా సుప్రియా సాహు పోస్ట్ చేశారు. ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సచిన్, వెంకటేశ్ ప్రభు, ప్రసాద్, విజయ్, జార్జ్ ప్రవీన్సన్, తంబ కుమార్, అనీష్, కుమార్, పండలూర్ ఏపీడబ్ల్యూ బృందాల కృషిని ఆమె అభినందించారు.