ఏడాదికి గరిష్ఠ ఫీజు రూ.1.9 లక్షలు
ఎంటెక్ కనీస వార్షిక ఫీజు రూ.1,41,200
ఏఐసీటీఈ సిఫారసు.. కేంద్రం ఆమోదం
అమలుచేయాలని రాష్ర్టాలకు లేఖలు
న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (గ్రాడ్యుయేషన్) కనీస వార్షిక ఫీజును కేంద్ర విద్యాశాఖ రూ.79,600గా నిర్ణయించింది. ఏడాదికి గరిష్ఠంగా రూ.1,89,800 వరకు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది.
ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులను అమలుచేయాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విద్యాశాఖ లేఖలు రాసినట్టు ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్కుమార్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రభుత్వాలు గరిష్ఠ ఫీజులను మాత్రమే నిర్ణయిస్తూ వస్తున్నాయి. కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయకుండా ఇది ఉపయోగపడుతూ వస్తున్నది. మొదటిసారి కేంద్ర ప్రభుత్వం కనీస ఫీజును కూడా నిర్ణయించింది.