Azam Khan | రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు రాంపూర్ జైలు నుంచి ఆదివారం తరలించారు. ఆజంఖాన్ను సీతాపూర్ జైలుకు, అబ్దుల్లాను హర్దోయ్ జైలుకు తరలించారు. విచారణ అనంతరం ఇద్దరిని వేర్వేరు ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఇదే కేసులో ఆజం ఖాన్ భార్య రాంపూర్ జైలులోనే ఉండనున్నారు.
బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఆజం ఖాన్, ఆయన భార్య తజిన్ ఫాత్మా, తనయుడు అబ్దుల్లాకు ఎంపీఎల్ఏ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే రూ.50వేల జరిమానా సైతం విధిస్తూ.. ముగ్గురిని జైలుకు తరలించాలని ఆదేశించింది. ఆ తర్వాత పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని రాంపూర్ జైలుకు తరలించారు. శనివారం రాత్రి ఆజం, అబ్దుల్లాను రాంపూర్ జైలు నుంచి తరలించాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయని.. ఈ మేరకు ఆజం ఖాన్ను సీతాపూర్, అబ్దుల్లా ఆజమ్ను హర్దోయ్ జైలుకు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ ద్వివేది తెలిపారు. ఆజం భార్య తజిన్ ఫాత్మాను రాంపూర్లోనే ఉంచినట్లు పేర్కొన్నారు.
అయితే, జైలు నుంచి బయటకు తీసుకువెళ్లే సమయంలో ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని ఎస్పీనేత ఒకరు ఆరోపించారు. ఆజం కుటుంబం చాలాకాలంగా వేధింపులకు గురవుతోందన్నారు. ఇద్దరిని ఉదయం 5గంటలకు పరీక్షల పేరుతో రాంపూర్ జైలు నుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, పోలీసు వాహనంలో కూర్చునేందుకు ఆజంఖాన్ నిరాకరించారు. దీంతో పోలీసులు ఆరోగ్య సమస్యలపై వివరించి నచ్చజెప్పారు. గతంలో ఎస్పీ సీనియర్ నేత తనకు ప్రాణహాని ఉందని చెప్పడం గమనార్హం.