రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం ఓ కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి ఆ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ డుమ్మా కొట్టారు. అలాగే అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా డుమ్మా కొట్టారు. దీంతో ఈ ఇద్దరికీ అఖిలేశ్తో పొసగడం లేదని స్పష్టమైంది. అయితే ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోయారో పార్టీకి వివరణ కూడా ఇవ్వలేదని సీనియర్లు అంటున్నారు.
ఆజం ఖాన్ కొన్ని రోజులుగా అఖిలేశ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జైలు నుంచి విడుదలవ్వగానే అఖిలేశ్పై విరుచుకుపడ్డారు. అయిన వారే తనను ఇబ్బందులకు గురి చేశారని, తనపై విషం చిమ్మారంటూ నేరుగా ఆరోపణలకు దిగారు. ఇక.. ఆజంఖాన్ మద్దతు దారులు కూడా కొన్ని రోజుల క్రితం అఖిలేశ్పై విమర్శలు చేశారు. అఖిలేశ్ తల్చుకుంటే ఆజంఖాన్కు బెయిల్ దొరికేదని, కానీ.. అఖిలేశ్ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని కూడా విమర్శలు చేశారు.
అఖిలేశ్ బాబాయ్ ఇలా కీలక సమావేశానికి డుమ్మా కొట్టడం ఇది రెండో సారి. గతంలో కూడా ఇలా ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టేసి… భాగవతం వినడానికి వెళ్లారు. అప్పట్లో ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆజంఖాన్, శివపాల్ యాదవ్ కలిసి ఓ పార్టీ పెట్టనున్నారన్న ప్రచారమూ ఉంది. ఇలా ఇద్దరూ కూడబలుక్కొని కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీలో ఓ విధమైన చర్చ ప్రారంభమైంది.