లక్నో, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్లో ఆయుష్ కుంభకోణం జరిగిందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘నీట్-2021 పరీక్ష రాయకుండానే వందలాది మంది విద్యార్థులకు ఆయుర్వేద, యునానీ, హోమియోపతి కాలేజీల్లో సీట్లు లభించాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 891 మందికి ప్రవేశాలు కల్పించారు. కౌన్సెలింగ్ కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ.. ఈ బాధ్యతను ఇతర కంపెనీలకు అప్పగించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇది జరుగబోదని, అయితే జూనియర్లపై తప్పును నెట్టేసే కుట్రకు ప్రభుత్వం పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. ఆయుష్ స్కామ్ మంచుకొండలో కేవలం ఒక ముక్క మాత్రమేనని అభివర్ణించారు. ఇంకా బయటపడాల్సిన కుంభకోణాల చిట్టా పెద్దదేనన్నారు.