అయోధ్య: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని(Ayodhya Ram Temple).. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే టెంపుల్ నిర్వహణ, పరిపాలన కోసం ఆలయ ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించనున్నది. దీని కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆ ట్రస్టు దరఖాస్తులు కోరుతున్నది. సోషల్ మీడియా అకౌంట్లో సీఈవో అర్హత గురించి అయోధ్య ట్రస్టు వివరాలు వెల్లడించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి దరఖాస్తుదారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆ వ్యక్తికి కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలని రామజన్మభూమి ట్రస్టు బోర్డు పేర్కొన్నది. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 18వ తేదీ గడువు విధించారు. గతంలో ఆలయాలకు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారుడు కచ్చితంగా హిందూ మత విశ్వాసి అయి ఉండాలి.
మరో వైపు అయోధ్య రామాలయంలో నిధులను చోరీ చేసిన కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో కేంద్రానికి, అయోధ్య ట్రస్టు బోర్డుకు, యూపీ ప్రభుత్వానికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిధుల చోరీపై యూపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం నివేదికను వెల్లడించాలని కూడా సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. సీఈవోగా నియమితుడైన వ్యక్తికి మూడేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి అయోధ్యలోనే బస చేయాలి. సెలెక్షన్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులను షార్ట్లిస్టు చేస్తారు, ఆ తర్వాత వారికి ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనున్నారు. రామ మందిర నిర్వహణకు పరిపాలనా అధికారిగా సీఈవో ఉంటారని, మిగితా వారంతా ట్రస్టుకు బాధ్యులై ఉంటారని తీర్థక్షేత్ర ట్రస్టు బోర్డు పేర్కొన్నది.