న్యూఢిల్లీ, జూన్ 20: అయోధ్యలోని రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో యావత్ ఆలయ నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పిలుపునిచ్చారు. పర్యవేక్షణ, జవాబుదారీతనం, నిర్దేశిత విధానాల అమల్లో ఉన్న తీవ్ర లోపాలను ఈ ఘటన బయటపెట్టిందని ఆయన చెప్పారు. అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు భక్తుల విశ్వాసానికి గొడ్డలిపెట్టుగా మారడమే కాకుండా ఆలయ పరిపాలనా వ్యవస్థలోని బలహీనతలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాయని ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
తాను అధికారికంగా ఎటువంటి ప్రతిపాదన సమర్పించలేదని, కానీ తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్నానని ఆయన అన్నారు. మొత్తం నిర్వహణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి అనుభవజ్ఞులైన నిపుణులకు అప్పగించాలన్నదే తన అభిప్రాయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రధాని మోదీ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి అయిన మిశ్రా అన్నారు. ఈ ఆరోపణలు తనను బాధించినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి అవుతున్న సమయంలో ఇలా జరగడం విచారకరమని ఆయన అన్నారు. దాదాపు 1,500 మంది ఆలయ సముదాయంలో వివిధ పనులలో నిమగ్నమై ఉంటారని, అధికారికంగా జవాబుదారీతనంతో కూడిన నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు అత్యంత అవసరమని అన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 20: అయోధ్యలో రామాలయానికి చెందిన విరాళాలు, విలువైన వస్తువులు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఒకపక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరుపుతుండగా ఆలయానికి చెందిన విరాళాల రికార్డుల నుంచి 60 కిలోల వెండి కడ్డీలు గల్లంతైనట్లు తెలుస్తున్నది. దీంతో ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల నిర్వహణకు సంబంధించిన మిస్టరీ మరింత పెరుగుతున్నది. ఈ వెండి కడ్డీలు రామాలయంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బాలరాముడికి భక్తులు సమర్పించినట్లు తెలుస్తున్నది.
వీటిని ఆలయ పునాదిలో ఉంచాలని ఉద్దేశించినట్లు సమాచారం. ఈ కానుకలకు సంబంధించిన ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. గత వారం రోజులుగా దర్యాప్తు జరుపుతున్న సిట్ వెండి కడ్డీలకు సంబంధించిన పత్రాలను సేకరించి వాటి ప్రస్తుత స్థితిని ధృవీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అయితే అధికారులు ఇంకా ఆ కానుకల ఆచూకీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను కనుగొనలేదని, లేదా వాటి స్థితి ఏమిటో నిర్ధారించలేదని తెలుస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ వెండి కడ్డీల స్వీకరణ, భద్రపరచడం లేదా వినియోగానికి సంబంధించిన రికార్డులను గుర్తించడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. కాగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు వెండి కడ్డీలు అప్పగించినట్లు ధృవీకరించే రసీదు తమ వద్ద ఉన్నదని వెండిని విరాళంగా ఇచ్చిన జ్యువెలర్స్ అసోసియేషన్ పేర్కొన్నది.