Ayodhya | లక్నో, జనవరి 21: అయోధ్యలోని వివిధ దేవాలయాల్లో సమర్పించే పూలతో అగరుబత్తీలు తయారుచేసేందుకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రాజెక్ట్ను చేపట్టింది. అయోధ్యలోని ఆలయాల్లో పూల వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ నిమిత్తం ‘ఫూల్’ అనే కంపెనీతో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
ఆలయాల ప్రాంగణంలో పరిశుభ్రతను పాటించటం కోసం వినూత్నమైన ఈ ప్రాజెక్ట్ను చేపట్టామని, సోమవారం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రోజుకు 9 టన్నుల పూల వ్యర్థాలు రావొచ్చునని అధికారులు అంచనావేస్తున్నారు.