అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాదీ పేరు పెట్టాలని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) నిర్ణయించింది. ఈ మసీదు, హాస్పిటల్, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, కమ్యూనిటీ కిచెన్ మొత్తం ప్రాజెక్ట్ను ఫైజాబాదీకి అంకితమివ్వనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. 1857 తిరుగుబాటులో రెండేళ్ల పాటు అవధ్ను బ్రిటీషర్ల నుంచి కాపాడిన యోధుడు ఫైజాబాదీ. ఈయననే లైట్హౌజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తారు.
ఆయన అమరులైన రోజున ఈ ప్రాజెక్ట్ మొత్తానికీ ఫైజాబాదీ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఐఐసీఎఫ్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ చెప్పారు. హిందూ-ముస్లిం సోదరభావానికి మౌల్వీ ఫైజాబాదీ ఓ ఐకాన్గా నిలిచారు. అందుకే గత జనవరిలో ఇక్కడి రీసెర్చ్ సెంటర్ను ఆయనకు అంకితమిచ్చాం. తొలి స్వాతంత్య్ర సమరం జరిగి 160 ఏళ్లయినా భారత చరిత్రలో ఫైజాబాదీకి తగిన గుర్తింపు దక్కలేదని ఆయన అన్నారు. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ ఐదు ఎకరాల భూమిని మసీదు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డు ఈ మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్ను ఏర్పాటు చేసింది. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మాత్రం దీనికి పెట్టకూడదని ఈ ట్రస్ట్ గతంలోనే నిర్ణయించింది.