Ayodhya | ఈ ఏడాది డిసెంబర్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు రామ మందిరం నిర్మాణ కమిటీ ప్రకటించింది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో రామనవమి ఉత్సవాల సన్నాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. ఇప్పటికే గర్భగుడి ఆలయ పనులు పూర్తికావడంతో బాల రాముడిని ప్రతిష్ఠించగా.. దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో మిగతా పనులు శరవేగంగా సాగుతుండగా పనులను పరిశీలించారు.
ప్రధాన ఆలయ ప్రాకార నిర్మాణానికి రాయి అవసరమని చెప్పారు. ఈ రాళ్లను చెక్కుతున్నారన్నారు. భక్తుల ఫెసిలిటీ సెంటర్ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. డిసెంబర్ 2024 నాటికి ఆలయ పనులు పూర్తవుతాయి. జనవరి 2025 నుంచి ఆలయం మొత్తం అందుబాటులోకి రానున్నాయి. రామ నవమి తర్వాత ఆలయం పూర్తయ్యే వరకు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేస్తారని వస్తున్న వార్తలను ట్రస్ట్ తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనాలను నిలిపివేయమని స్పష్టం చేసింది. భక్తులకు సాధారణ పద్ధతిలోనే దర్శనాలు కొనసాగుతాయని పేర్కొంది.
రామనవమి రోజున మధ్యాహ్నం 12.16 గంటలకు సూర్య కిరణాలు రామ్లల్లా నుదుటన తిలకంగా నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కనిపిస్తాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. అలాగే ఉదయం 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్లల్లా దర్శనాలు కొనసాగనున్నాయి. రామనవమి సందర్భంగా 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలిపి.. మంగళహారతి, అభిషేకంతో పాటు దర్శనాలు కొనసాగుతాయని రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.