అయోధ్య : అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో నిందితుల్లో ఎవరి పక్షాన వాదించకూడదని అయోధ్య బార్ అసోసియేషన్ సోమవారం తీర్మానించింది. ఎవరైనా న్యాయవాది వారి తరపున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయోధ్యలో జరిగిన ఫైజాబాద్ అడ్వొకేట్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ కేసులో తీర్పు ఆలయానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అయోధ్య బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిక ప్రసాద్ మిశ్రా తెలిపారు.
ఆలయ కానుకల అపహరణ ఆరోపణలపై ఫైజాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మూడు రోజుల్లోగా అయోధ్యను విడిచి వెళ్లాలని రామాలయం నిర్వాహకులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులకు బార్ అసోసియేషన్ గడువు ఇచ్చింది. వాళ్లు దీన్ని పాటించకపోతే నగరమంతా దిగ్బంధనం చేస్తామని హెచ్చరించింది.
రామ మందిరం విరాళాల చోరీ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ‘ఆకాశం ఏమీ విరిగిపడదు. దీనిని అంత త్వరితంగా విచారించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించింది.