FD Rates | న్యూఢిల్లీ, జూన్ 2: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చిన క్రమంలో గడిచిన రెండేండ్లుగా బ్యాంకులు కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీరేట్లను పెంచుతూ వచ్చాయి. దీంతో ఎఫ్డీలపై ఇంట్రెస్ట్ రేట్లు కొత్త గరిష్ఠాలకే చేరాయి. అయితే గత రెండు నెలలుగా ఎఫ్డీలపై వడ్డీరేట్ల పెంపు మందగించింది. ఇక ఇప్పుడు వడ్డీరేట్ల కోతలు మొదలయ్యాయి. యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి.
7 రోజుల నుంచి 10 ఏండ్ల వరకున్న వివిధ కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయా ఎఫ్డీలపై వడ్డీరేట్లు 3.5 శాతం నుంచి 7.1 శాతానికి పరిమితమయ్యాయి. ఏడాది మీద 5 రోజుల నుంచి 13 నెలల్లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడు 6.8 శాతమే. ఇంతకుముందు ఇది 7.1 శాతం. అలాగే 13 నెలలు, రెండేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 7.15 శాతం నుంచి 7.1 శాతానికి బ్యాంక్ తీసుకొచ్చింది. గత నెల 18 నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెగ్యులర్ సిటిజన్లకు సంబంధించి ఏడాదిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.8 శాతం నుంచి 6.75 శాతానికి తీసుకొచ్చింది. ఇప్పటికే గత నెల 666 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై వడ్డీరేటును 7.25 శాతం నుంచి 7.05 శాతానికి బ్యాంక్ తెచ్చింది. కాగా, రూ.2 కోట్లలోపుండే ఎఫ్డీలకే ఈ వడ్డీరేట్ల మార్పుంటుందని, ఈ నెల 1 నుంచే వర్తిస్తుందని బ్యాంక్ తెలియజేసింది.
ఇంతకుముందు జనరల్ సిటిజన్స్ ఎఫ్డీలకు 7.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం చొప్పున వడ్డీరేట్లను ఆఫర్ చేసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు ఇవి వరుసగా 7 శాతం, 7.5 శాతం, 7.75 శాతానికి తగ్గాయి. ఈ మేరకు బ్యాంక్ వెబ్సైట్లో చూస్తే తెలుస్తున్నది. ఆయా కస్టమర్లకు వివిధ ఎఫ్డీలపై 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించేసింది.
మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రుణగ్రహీతలను ఆకట్టుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. జూన్ నెలకుగాను మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్)ను బ్యాంక్ సవరించింది. దీంతో గృహ రుణాల వంటివి మరింత ఆకర్షణీయంగా మారినైట్టెంది. కాగా, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.35 శాతానికి రాగా, 3 నెలల ఎంసీఎల్ఆర్ కూడా 15 బేసిస్ పాయింట్లు దిగి 8.4 శాతానికి వచ్చింది. అయితే 6 నెలలు, ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగి 8.75 శాతం, 8.85 శాతం వద్ద ఉన్నాయి. ఈ మార్పులు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుత పరిణామాలనుబట్టి ఎఫ్డీలపై వడ్డీరేట్ల పెంపునకు బ్రేకులు పడ్డట్టేనన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా రూ.2000 నోట్ల ఉపసంహరణ.. బ్యాంకుల్లో భారీ ఎత్తున ఎఫ్డీలకు దారితీసిందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బ్యాంకర్లు వడ్డీరేట్ల కోతలతో ప్రయోజనం పొందాలని చూస్తున్నట్టు చెప్తున్నారు. పైగా రుణాలకు డిమాండ్ తగ్గడం కూడా బ్యాంకుల్లో నగదు నిల్వలను పెంచేస్తున్నాయని, దీనివల్ల ఎఫ్డీలకు బ్యాంకులు తక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఆర్బీఐ కూడా రెపోరేటును తమ తదుపరి సమీక్షల్లో యథాతథంగానే ఉంచాలని చూస్తున్నదని, లేదంటే కొంతమేర తగ్గించాలని భావిస్తున్నదన్న అభిప్రాయాలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఫలితంగా మున్ముందు మరిన్ని బ్యాంకులు తమ ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.