Kerala : కేరళలో విషాదం జరిగింది. తన వ్యవసాయ విధానాలకు గతంలో అవార్డులు గెలుచుకున్న ఒక రైతు చివరకు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ, చెరుపుళ ప్రాంతం, ఇదవారం పరిధిలో జరిగింది. అంబట్టు ఇలియాస్ (62) అనే రైతు నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో తను అనుసరించిన నూతన విధానాలు, లాభాలతో రైతుగా ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నాడు.
అలాగే కొన్నేళ్లుగా పర్వత ప్రాంతాలైన కన్నూర్ జిల్లాతోపాటు, కాసర్గోడ్ జిల్లాలో కూడా భూమి అద్దెకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలి సీజన్లో 2,500 అరటి చెట్లను నాటాడు. కానీ, వాటి ద్వారా ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లింది. సరైన పంట లేక, ఆదాయం రాక లక్షల రూపాయలు నష్టపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువ కావడంతో మూడు రోజుల క్రితం ఇలియాస్ తన తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఇలియాస్ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైతు ఆత్మహత్య ఘటన అక్కడి చిన్న రైతుల కష్టాలకు నిదర్శనం అని పలువురు రైతులు అంటున్నారు.