న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : గత దశాబ్ద కాలంలో భారత దేశంలో వివాహ సగటు వయసు 27 నుంచి 29కి పెరిగింది. అలాగే పునర్వివాహం చేసుకునే వారి సంఖ్య 43 శాతం పెరిగింది. ఈ కొత్త గణాంకాలు భాగస్వామి ఎంపిక, నిబద్ధతలో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయని గురువారం వెలువడిన ఒక నివేదిక వెల్లడించింది. మ్యాట్రిమోని సంస్థ జీవన్సాథీ 2016 నుంచి 2025 వరకు 30 వేల మందికి పైగా వ్యక్తులతో జరిపిన సర్వే ప్రకారం వివాహ సగటు వయసు 27 నుంచి 29కి పెరిగింది. 50 శాతం మంది పెండ్లి సంబంధాలు చూడటం 29 నుంచే మొదలు పెడుతున్నారు.
ముందస్తు వివాహాల కంటే ఆర్థిక స్థిరత్వం, కెరీర్లో ఎదుగుదల, వ్యక్తిగత సంసిద్ధత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే పునర్వివాహం చేసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2016లో వీరి సంఖ్య 11 శాతం ఉండగా అది 43 శాతం పెరిగి 2025 నాటికి 16 శాతానికి చేరుకుంది. వివాహానికి కులం ముఖ్యమైన అంశంగా 2016లో 91 శాతం మంది భావించగా, 2025 నాటికి ఇది 54 శాతానికి పడిపోయింది. ఉద్యోగ, వృత్తులలో తమ కంటే ఎక్కువ సంపాదించే మహిళలను వివాహం చేసుకోవడం తమకు అంగీకారమేనని 87 శాతం మంది పురుషులు పేర్కొనగా, తమ కంటే తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను పెండ్లి చేసుకోవడానికి 15 శాతం మంది మహిళలు సమ్మతి తెలిపారు.