Uttarakashi Tunnel Collapse | న్యూఢిల్లీ, నవంబర్ 25: ఉత్తరాఖండ్ ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల వెలికితీతకు అడ్డంకులు మీద అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని అందరూ అనుకుంటుండగా, వారు బయటపడటానికి మరిన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టవచ్చునని అధికారులు శనివారం పేర్కొన్నారు. సొరంగం తవ్వడానికి తెచ్చిన ఆగర్ మిషన్ ఆగిపోవడంతో శుక్రవారం సాయంత్రం సహాయపని నిలిచిపోయింది.
సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న అమెరికాకు చెందిన ఆగర్ మిషన్కు సొరంగంలోని ఒక ఇనుప పట్టీ అడ్డుపడి బ్లేడ్ దెబ్బతినడంతో పని ఆగిపోయింది. దీంతో ఇరుక్కుపోయిన బ్లేడ్ను కట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ను రప్పిస్తున్నారు. లక్ష్యానికి ఇంకా 10-12 మీటర్ల దూరంలో డ్రిల్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు అధికారులు రెండు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. 10-12 మీటర్ల దూరాన్ని మాన్యువల్గా డ్రిల్లింగ్ చేయడం, లేదా కొండపై నుంచి నిలువుగా 86 మీటర్లు డ్రిల్లింగ్ చేయడం. ఇది పూర్తవ్వడానికి కొన్ని వారాల పాటు పట్టవచ్చునని ఎన్డీఎంఏ మెంబర్ లెఫ్ట్నెంట్ జనరల్ సయ్యద్ హస్నాయన్ తెలిపారు.