న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం ఢిల్లీలో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన పోలింగ్ డేటా వివాదంపై మాట్లాడారు. సందేహాల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. బూత్ల వారీగా పోలింగ్ శాతంపై ఎలాంటి ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయంపై సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) స్పందించారు. ‘వారు (న్యాయమూర్తులు) నిజాన్ని అంగీకరించారు. సందేహాస్పద వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. మేం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీని గురించి అందరితో చర్చిస్తాం’ అని అన్నారు.
కాగా, దేశ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం కావడం పట్ల సీఈసీ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు, ఆందోళనలను పరిష్కరించేందుకు ఈసీ నిబద్ధతతో ఉందని తెలిపారు. బహుశా ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవడం, ఓటింగ్ లిస్ట్ తప్పుగా ఉండటం లేదా ఓటర్ల జాబితా తారుమారు కావడం వంటి పలు సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా దీని గురించి ప్రస్తావించిందని అన్నారు. ‘ఇలాంటి సందేహాలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఎందుకు అనుమానాలు తలెత్తుతున్నాయి? ఏం నాటకం జరుగుతోంది? ఇవన్నీ ఒక రోజు బయటపెడతాం. ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో అందరికీ చూపుతాం’ అని అన్నారు.