దళిత యువకుడి కండ్లు పీకేసి దారుణంగా హత్య చేసిన దుండగులు-బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో సోమవారం జరిగిందీ ఘటన.
తన భార్యను చూస్తున్నాడన్న ఆరోపణతో దళిత యువకుడిని, అతని తల్లిదండ్రులను కాల్చిచంపిన వ్యక్తి-అదే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మంగళవారం జరిగింది.
టాయిలెట్ సీటు దొంగిలించాడని దళిత యువకుడికి గుండు గీసి, సిరా పూసి, స్తంభానికి కట్టేసి కొట్టిన బీజేపీ నేత-ఉత్తరప్రదేశ్లోనిది ఈ అకృత్యం
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గడిచిన వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు ఘటనలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, ఆ సామాజిక వర్గంపై కొనసాగుతున్న వివక్ష తీరును ప్రతిబింబిస్తున్నాయి. యూపీఏ-2 హయాంలో దళితులపై దేశవ్యాప్తంగా 1,73,088 దాడులు జరిగితే, మోదీ ఎనిమిదేండ్ల పాలనలో ఈ సంఖ్య రెట్టింపునకు పైగా 3,53,389కి పెరిగింది.
ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో అత్యధిక కేసులు యూపీలో నమోదవుతుండగా, ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది మొదలు.. దళితులపై జరుగుతున్న దాడులు అంతకంతకూ పెరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. అయినప్పటికీ కేసుల పరిష్కారానికి, నిందితులను శిక్షించడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దేశ జనాభాలో 30 శాతానికి పైగా ఉన్న దళితులకు ఇటీవలి కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు 3 శాతం మాత్రమే. దీన్ని బట్టి దళితులపై బీజేపీకి ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
దళిత పక్షపాతిగా కేసీఆర్ సర్కారు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఓ వైపు దళితులు వివక్షకు గురవుతూ, దాడులకు బలౌతుంటే.. తెలంగాణ సర్కారు ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. ‘దళిత బంధు’ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు, దళిత మహిళలకు మూడెకరాల చొప్పున భూపంపిణీ, దళిత విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వీలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యానిధి పథకం, దళితుల సాధికారత కోసం దళితుల ఎంపవర్మెంట్ స్కీమ్, ర్యాజ్యాంగ నిర్మాతకు ఆకాశమంత గౌరవాన్ని ఇస్తూ అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణం.. ఇలా గడిచిన ఎనిమిదేండ్లలో దళితుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా నిధులను కేసీఆర్ ప్రభుత్వం వెచ్చించింది.