Sri Lankan Police | అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. నలుగురిని విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం మేరకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) నలుగురిని అరెస్టు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (IS) ఆదేశాల మేరకు వీరు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్కు వచ్చినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టయిన నలుగురు నిందితులు పాకిస్థాన్లో నివసిస్తున్న శ్రీలంక నాయకుడి వద్ద పనిచేస్తున్న ఐఎస్ సభ్యులని తెలిపాయి.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ దేశ్బంధు తెన్నకోన్ ఆధ్వర్యంలో బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికార ప్రతినిధి, సీనియర్ సూపరింటెండెంట్ నిహాల్ తాల్దువా తెలిపారు. ఈ దర్యాప్తులో వారు నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటారన్నారు. ఈ విషయాన్ని, పరిణామాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భారత అధికారులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి నుంచి ఈ నలుగురు వ్యక్తులు పాక్లో నివసిస్తున్న ఐఎస్ఐఎస్ నాయకుడైన అబు అనే వ్యక్తితో పరిచయం ఉందని గుజరాత్ డీజీపీ వికాష్ సహాయ్ పేర్కొన్నారు.
సోషల్ మీడియా ద్వారా ఆయనతో టచ్లో ఉన్నారని.. భారత్లో ఉగ్రవాద దాడులకు అబు వారిని ప్రేరేపించాన్నారు. ఆత్మాహుతి బాంబు దాడికి కూడా సిద్ధమయ్యాడని.. అబు శ్రీలంక కరెన్సీలో నాలుగు లక్షలు సైతం ఇచ్చినట్లు చెప్పారు. రెండు మొబైల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో అహ్మదాబాద్ సమీపంలోని నానా చిలోడా ప్రాంతం ఫొటోను గుర్తించారు. ఉగ్రదాడి చేసేందుకు మందుగుండు సామగ్రిని ఇక్కడ దాచినట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నుఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రజ్దీన్లుగా గుర్తించారు. వద్ద నుంచి పాక్లో తయారు చేసిన మందుగుండు సామగ్రి, మూడు పాకిస్థానీ పిస్టల్స్, 20 లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు.