బదౌన్, మార్చి 20: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లిన వ్యక్తులు వారి ఇద్దరు పిల్లలను దారుణంగా గొంతు కోసి చంపడం సంచలనం సృష్టించింది. బదౌన్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటీవలే బార్బర్ షాపును ప్రారంభించిన సాజిద్ (22), అతని సోదరుడు జావేద్.. షాపుకు ఎదురుగా ఉన్న కాంట్రాక్టర్ వినోద్ ఇంటికి వెళ్లి గర్భవతి అయిన తన భార్యను దవాఖానలో చేర్చానని, రూ.5 వేలు సాయం చేయాలని అభ్యర్థించాడు. ఆ సమయంలో ఇంట్లో కాంట్రాక్టర్ తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. దాంతో కాంట్రాక్టర్ భార్య సంగీత డబ్బు తేవడానికి లోపలికి వెళ్లగా, ఇంటి పై భాగంలో సంగీత నడుపుతున్న బ్యూటీ సెలూన్ను చూద్దామంటూ సాజిద్ వారి పిల్లలను మేడపైకి తీసుకెళ్లి గొంతుకోశాడు.
ఆయుష్ (12), ఆహాన్ (8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో కుమారుడు యువరాజ్ (10) దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత బయట బైక్పై వేచి చూస్తున్న సోదరుడు జావేద్తో సాజిద్ పరారయ్యాడు. అయితే నిందితులు ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందీ తెలియరాలేదు. పసిపిల్లలను పొట్టనబెట్టుకున్న ఇద్దరు నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడి దుకాణాన్ని స్థానికులు తగులబెట్టారు. సంఘటన జరిగిన కొన్ని గంటలకే మంగళవారం సాయంత్రం పోలీసులు సాజిద్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మరో నిందితుడు జావెద్ పరారీలో ఉన్నాడు. కాగా, మృతుల కుటుంబానితో తన కుమారులకు ఎలాంటి విరోధం లేదని, వారు చేసిన చర్యలకు తగిన ఫలితం అనుభవించారని నిందితుల తల్లి పేర్కొంది. ఈ హత్యతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.