Atishi: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణల కేసులో ఢిల్లీ మంత్రి అతిషికి నోటీసులు అందించేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు. తాము వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో లేరని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆమెకు నోటీసులు అందజేయడానికి మరోసారి వస్తామని చెప్పారు.
కాగా పోలీసులు తీసుకొచ్చిన నోటీసులను తన కార్యాలయ సిబ్బందికి అందించాలని అతిషి చెప్పినా.. అందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్కు కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసులు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశించారు.
కొనుగోలు చేసేందుకు భాజపా నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్ ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని పేర్కొన్నారు. కాగా, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జనవరి 27న అతిషి, కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. దాంతో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.