Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ క్లీన్ పాలిటిక్స్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ స్థాపిస్తారా.. సీఎం అశోక్ గెహ్లాట్తో విభేదాలు మరింత పెరుగుతాయా? అని అంచనా వేసిన రాజకీయ విశ్లేషకుల ఆశలు నిరాశయ్యాయి. తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా తన కంచుకోట దౌసాలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకున్నారు.
‘యువతకు మంచి భవిష్యత్ ఉందని నేను చెబుతున్నా. నాకు ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంది. నా వాణి బలహీనమైంది కాదు. నేను వెనక్కు తగ్గేది లేదు. దేశానికి సత్యమైన రాజకీయాలు కావాలి. యువత భవిష్యత్తో ఆటలాడుకునే వారి ఆట కట్టిస్తాం. నేను స్వచ్ఛమైన (క్లీన్ పాలిటిక్స్) రాజకీయాలు కోరుకుంటున్నా.. నా విధానం స్పష్టంగా ఉంది’ అని సచిన్ పైలట్ చెప్పారు.
ప్రతి ఏడాది మాదిరిగానే గుజ్జార్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన తన తండ్రి రాజేష్ పైలట్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అంతా భావించారు.
రాజేశ్ పైలట్ వర్ధంతి సభ జరుగక ముందు సచిన్ పైలట్ మద్దతు దారులు మాట్లాడుతూ ఆరు నెలల్లోపు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా, ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. కానీ సచిన్ పైలట్ కొత్త పార్టీ ఏర్పాటు చేసే విషయమై నోరు మెదపడం లేదు.