బెంగళూరు: టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ మహిళ (Uzbekistan Woman) హోటల్ రూమ్లో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్కు చేరుకుని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ మహిళను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉజ్బెకిస్థాన్కు చెందిన 37 ఏళ్ల జరీనా నాలుగు రోజుల కిందట టూరిస్ట్ వీసాపై బెంగళూరు చేరుకుంది. శేషాద్రిపురం ప్రాంతంలోని జగదీష్ హోటల్లో ఆమె బస చేసింది.
కాగా, బుధవారం మధ్యాహ్నం 4.30 గంటలకు హోటల్ సిబ్బంది జరీనా రూమ్ డోర్ తట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మరో కీతో డోర్ తెరిచి చూశారు. బెడ్పై ఆమె మరణించి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ హోటల్కు చేరుకున్నారు. జరీనాను ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. జరీనా బస చేసిన రూమ్ను నిశితంగా పరిశీలించారు.
మరోవైపు బుధవారం జరీనా గదిలోకి ఎవరైనా వెళ్లారా అన్నది తెలుసుకునేందుకు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జరీనా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.