Uma Bharti | లక్నో : అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్యమంలో నాడు పాల్గొన్న సాధ్వి రితంభరను ఉమాభారతి ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరకు తమ స్వప్నం నెరవేరడంతో ఉమాభారతి, సాధ్వి రితంభర రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరై, తమ రామభక్తిని చాటుకున్నారు.
32 ఏండ్ల 46 రోజుల క్రితం నాటి జ్ఞాపకాలను ఉమాభారతి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. హిందూవులు బాబ్రీ మసీదు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ జన్మభూమి ఉద్యమంలో ఉమాభారతి చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు అదే స్థలంలో ఇవాళ రామాలయం కొలువుదీరడంపై ఉమాభారతి సంతోషం వ్యక్తం చేశారు. హిందూవులందరూ రాముడిని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన కోసం ఆ రాముడు తమకు ధైర్యం ఇచ్చారని సాధ్వి రితంభర తెలిపారు.
రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ప్రాణప్రతిష్ఠ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే వీరిద్దరి వయసు 90 ఏండ్లకు పైగా ఉండటంతో, వారి వయసు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రాణప్రతిష్ఠకు హాజరు కాలేదని తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, సాధ్వి రితంభరతపై అభియోగాలు మోపగా, 2020లో ప్రత్యేక సీబీఐ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
Ayodhya, Uttar Pradesh | BJP leader Uma Bharti and Sadhvi Rithambara hug each other ahead of Ram Temple Pran Pratishtha ceremony today pic.twitter.com/zfFjPJoVbh
— ANI (@ANI) January 22, 2024