Chandrayaan-3 | న్యూఢిల్లీ : జాబిల్లి దిశగా చంద్రయాన్-3 వడివడిగా అడుగులు వేస్తున్నది. ఒక్కో అంకాన్ని దాటుకుంటూ తన పయనాన్ని సాగిస్తున్నది. విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయితే.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనున్నది. నాలుగేండ్ల క్రితమే భారత్ ఈ ఘనతకు చేరువగా వెళ్లి 335 మీటర్ల దూరంలో నిలిచిపోయింది. సరిగ్గా నాలుగేండ్ల క్రితం 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది.
సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందనుకుంటే…
చంద్రుడి గుట్టు విప్పేందుకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్-2 స్పేస్క్రాఫ్ట్ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనుకున్న విధంగానే 2019 ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి విక్రమ్ ల్యాండర్ ప్రవేశించింది. 2019 సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచించారు. చివరి రోజు వరకు అన్నీ సజావుగా సాగాయి. దీంతో చంద్రుడిపై ల్యాండర్ను దించి భారత్ సగర్వంగా తలెత్తుకుంటుందని అందరూ భావించారు. కానీ సెప్టెంబర్ 7న యావత్ దేశాన్ని విషాదంలో ముంచుతూ ఇస్రో ప్రకటన చేసింది.
చంద్రుడి కక్ష్యలోనే ఆర్బిటర్…
చివరి నిమిషంలో ల్యాండర్లో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తినట్టు ఇస్రో తెలిపింది. ఊహించిన దానికంటే వేగంగా విక్రమ్ జాబిల్లి వైపు దూసుకెళ్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ఉపరితలానికి 5 కి.మీ దూరంలో ఈ సమస్య ప్రారంభమైంది. విక్రమ్ వేగాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉపరితలానికి 2.1 కి.మీ దూరంలో ఉండగా గ్రౌండ్స్టేషన్ల నుంచి విక్రమ్ కమ్యూనికేషన్ను కోల్పోయింది. చంద్రుడి ఉపరితలానికి సరిగ్గా 335 మీటర్ల దూరంలో విక్రమ్తో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైనప్పటికీ ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతున్నది. జాబిల్లి వాతావరణం, ఉపరితలానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తున్నది. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో ఈ సమాచారాన్ని వినియోగించుకొని మరోసారి చంద్రుడిపై గురిపెట్టింది. చంద్రయాన్-3తో జాబిల్లి గుట్టు విప్పేందుకు సిద్ధమైంది.