న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర తన బృందంతో కలిసి యూపీలో పర్యటించిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించారు. అయితే ఈసారి ఎన్ని దశల్లో నిర్వహిస్తారో చూడాల్సిందే. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఇటీవల సుశీల్ చంద్ర వెల్లడించారు.