Assembly Election Results 2023: మధ్యప్రదేశ్లో ఈసారి ప్రభుత్వ మార్పు తప్పదని, రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వీస్తుందని కొంతకాలంగా రాజకీయ విశ్లేషకులు భావించినా ఫలితాలు మాత్రం అనూహ్యంగా వచ్చాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి భారీ విజయం దిశగా సాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ఛరిష్మా చాటారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఫలితాలలో మాత్రం కనిపించలేదు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసినా జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన షాక్తో ఆ పార్టీ మళ్లీ ప్రతిపక్షంలోకి చేరడంతో ఆ సింపతీ అయినా వర్కవుట్ అవుతుందేమోనని భావించినా అది కూడా వర్కవుట్ కాలేదు.
ప్రభావం చూపని ప్రభుత్వ వ్యతిరేకత..
బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఓట్ రూపంలో మలుచుకోలేకపోయింది. 18 ఏండ్లుగా చౌహాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ సఫలం కాలేకపోయింది. మతం పేరిట బీజేపీ చేస్తున్న అరాచకాలను ఎత్తిచూపడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది.
ఆ ఇద్దరిపైనే ఫోకస్..
మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ఇప్పటికీ వృద్ధ నేతలైన కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ల మీదే హస్తం ఆధారడింది. పార్టీలో యువ రక్తాన్ని ఎంకరేజ్ చేయకపోగా ఇప్పటికీ డిగ్గీ రాజా, కమల్నాథ్ మీదే ఆశలు పెట్టుకుంది. కానీ ఈ వృద్ధ నేతలు కాంగ్రెస్ను గట్టించలేకపోయారు. కమల్నాథ్ నియంతృత్వ పోకడ కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సక్సెస్ అయ్యారు. జ్యోతిరాధిత్య సింధియా పార్టీ నుంచి వెళ్లిపోయినా కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ కళ్లు తెరవలేదు. యువ నేతలను ప్రోత్సహించలేదు. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కూడా ఆ పార్టీని నిండా ముంచింది.