గౌహతి: అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీని ఉసిగోల్పే బీజేపీ, మిత్రపక్షం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆప్ ప్రశ్నించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని అధికార బీజేపీ మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) మాజీ నేత బెంజమిన్ బాసుమతరీ (Benjamin Basumatary) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒంటి పైభాగంపై దుస్తులు లేకుండా బెడ్పై పడుకున్న ఆయన శరీరంతోపాటు చుట్టూ రూ.500 నోట్లు కుప్పగా పడి ఉన్నాయి.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోను పంజాబ్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) షేర్ చేసింది. అస్సాంలో బీజేపీ కూటమి పార్టీ నేతకు వ్యతిరేకంగా ఈడీ, సీబీఐ లేదా అస్సాంలోని ఏ దర్యాప్తు సంస్థ అయినా చర్య తీసుకునే సాహసం చేయబోదని ఆరోపించింది. ‘అత్యున్నత స్థాయి ప్రభుత్వ స్కూల్స్, , ఆసుపత్రులను ఏర్పాటు చేసిన వారిని (అరవింద్ కేజ్రీవాల్) జైలుకు పంపుతున్నారు. ప్రజా ధనాన్ని దోచుకునే వారు అధికార ప్రయోజనాలు అనుభవిస్తున్నారు. ఇది సిగ్గుచేటు’ అని విమర్శించింది.
మరోవైపు అది తన ఫొటోనే అని బెంజమిన్ బసుమతరీ ఒప్పుకున్నారు. అయితే ఐదేళ్ల కిందట తన స్నేహితులు ఒక పార్టీలో తీశారని తెలిపారు. ఆ ఫొటోలోని డబ్బు తన సోదరికి చెందినదని అన్నారు. అయితే బెంజమిన్ను ఈ ఏడాది జనవరి 10న పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు యూపీపీఎల్ అధ్యక్షుడు ప్రమోద్ బోరో తెలిపారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతోపాటు వీసీడీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బెంజమిన్కు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.