దిస్పూర్: క్రైం రేటులో (Crime rate) ముస్లింలు టాప్ ప్లేస్లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పాల్పడటంలో ముస్లింలు (Muslims) అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. మనం జైళ్లకు వెళ్లడంలో కూడా నంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. చదువు లేకపోవడంతోనే ముస్లింలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అసోంలో తీవ్ర దుమారమే రేగింది. పెద్దఎత్తున విమర్శలు వెళ్లువెత్తున్నప్పటికీ ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. తానేమే తప్పుగా మాట్లాడలేదని సమర్ధించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీ విద్యకు దూరంగా ఉండటం తాను చూశానన్నారు. ఉన్నత విద్య అటుంచితే కనీసం మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ కారణంగానే నేరాల రేటు అధికంగాఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను చూసినపుడు తమ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని యువకులు గుర్తుంచుకోవాలని సూచించారు. వారు తమ తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే లైంగికవేధింపులకు పాల్పడరని పేర్కొన్నారు. ముస్లిం యువత విద్య, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యువత చదువుకోవాలనే ఉద్దేశంతోనే తాను అలా అన్నానని వెల్లడించారు. కాగా, అసోంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏఐఈడీఎఫ్ ఒకటి. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు.