Assam | గువాహటి, ఫిబ్రవరి 24: ముస్లింల వివాహ, విడాకుల చట్టంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం ముస్లింల వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935ను రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. బాల్య వివాహాలకు అంతం పలకడానికే ఈ చర్య తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. చట్ట ప్రకారం పురుషులకు 21, స్త్రీలకు 18 ఏండ్లు నిండితేనే వివాహానికి అర్హులని, అయితే ఇంతవరకు ఉన్న చట్టం ప్రకారం వారికి ఆ వయసు లేనప్పటికీ వివాహ నమోదుకు అంగీకరించేవారని, దీంతో బాల్య వివాహాలకు ఊతమిచ్చినట్టయ్యిందని ఆయన తెలిపారు.
తాము తీసుకున్న ముఖ్యమైన ఈ నిర్ణయంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. ప్రస్తుతమున్న 94 ముస్లిం వివాహ రిజిస్ట్రార్లు అస్సాం ఐజీపీ (రిజిస్ట్రేషన్) పరిధిలోకి వస్తారని చెప్పారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ఖండించాయి. ఇది ముస్లింల పట్ల వివక్షాపూరితంగా ఉందని, ఎన్నికల సమయంలో ఓటర్ల ప్రలోభానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించాయి.