Assam elections : కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా అసోం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. కూటమిగా పోటీ చేసే పార్టీలు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
అలాగే కూటమిలోని ఏజీపీ (అసోం గణ పరిషద్) పార్టీ 26 సీట్లలో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 11 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశానికి హాజరైన అనంతరం హిమంత బిశ్వశర్మ ఈ వివరాల్ని మీడియాకు తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా బుధవారం ఢిల్లీలోనే జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. అనంతరం బుధవారం రాత్రి లేదా గురువారం రోజు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బొర్దోలోయ్ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, అంశంపై తనకు సమచారం లేదని హిమంత శర్మ అన్నారు. 2021లో ఎన్డీయే కూటమి అసోంలో విజయం సాధించింది. బీజేపీ 93 సీట్లలో పోటీ చేయగా, 60 సీట్లలో గెలుపొందింది. అలాగే ఏజీపీకి 25 సీట్లు కేటాయించగా, 29 సీట్లలో పోటీ చేసింది. 9 సీట్లు మాత్రమే గెలుపొందింది. అలాగే యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. ఈ పార్టీకి 8 సీట్లు కేటాయిస్తే, 11 సీట్లలో పోటీ చేసింది. 6 సీట్లు గెలిచింది. మొత్తంగా కూటమి 75 సీట్లు సాధించింది.