గువాహటి, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఇంటిని తగులబెట్టాలంటూ విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దేబబ్రత సైకియా బుధవారం అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్లోని విదీషా జిల్లాలో ఈ నెల 18న జరిగిన సభలో సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్పై విమర్శల సందర్భంగా 10, జన్పథ్ను తగులబెట్టాలి అంటూ హిమంత బిశ్వ శర్మ ద్వేషపూరిత ప్రసంగం చేశారని అస్సాం అసెంబ్లీ కాంగ్రెస్ పక్ష నేత అయిన సైకియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం 10, జన్పథ్లో సోనియా గాంధీ నివసిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్లు తన ఫిర్యాదుకు జత చేశారు. కాగా, బీజేపీ తరఫున రాజస్థాన్లో ప్రచారం నిర్వహిస్తున్న హిమంత ఈ ఫిర్యాదుపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.