అక్కడ చదివితే డాక్టర్లు కాలేరు
ఖురాన్ను ఇండ్లల్లో నేర్పించండి
అస్సాం బీజేపీ సీఎం హిమంత
దిస్పుర్, మే 22: ‘మదర్సా’ అనే పదాన్ని మనుగడలో లేకుండా చేయాల్సిన అవసరమున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మదర్సాలు కొనసాగుతున్నంత కాలం డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్న కలల్ని పిల్లలు కనలేరని పేర్కొన్నారు. ఆదివారం ఓ మీడియా కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. ‘మదర్సాల్లో చదివితే డాక్టర్లు, ఇంజినీర్లు కాలేరని మీ పిల్లలకు చెప్పండి. అప్పుడు, వాళ్లు అక్కడికి వెళ్లరు’ అని ముస్లింలకు సూ చించారు. మదర్సాలకు పిల్లలను పంపించడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. పిల్లలకు ఇండ్లల్లోనే ఖురాన్ను నేర్పించాలన్నారు.
మదర్సాల్లోని విద్యార్థులు చాలా నైపుణ్యవంతులని, ఖురాన్లోని ప్రతీ పదాన్ని వాళ్లు హృదయంలో నిక్షిప్తం చేసుకొంటారని హైదరాబాద్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ మాజీ చాన్స్లర్ ఈ సందర్భంగా అన్నారు. దీనిపై బిశ్వశర్మ స్పందిస్తూ.. భారత్లో పుట్టిన ప్రతీ ముస్లిం హిందువేనన్నారు. ఒకవేళ, ఓ ముస్లిం చిన్నారి అత్యంత మేధాసంపత్తితో ఉంటే, దానికి అతని హిందూ గతం కూడా ఒక కారణమేనని చెప్పారు. సొంత నిర్ణయాలను తీసుకొనే వయసు వచ్చినప్పుడే విద్యార్థులను మతసంస్థల్లోకి అనుమతించాలని అన్నారు. స్కూళ్లలో అధునాతన విద్యను అందించాల్సిన అవసరమున్నదన్నారు.
గుడులన్నింటినీ పునర్నిర్మించాలి: గోవా సీఎం
భారతదేశంలో పూర్వం కూలగొట్టిన ఆలయాలన్నింటిని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉన్నదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగల్ పాలనలో కూలగొట్టిన గుడులను పునర్నిర్మించడానికి తాము బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గోవాలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. గోవాలో మైనింగ్ను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.