చండీగఢ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను తగులబెట్టిన (stubble burning) గణాంకాలను ఎక్స్లో షేర్ చేశారు. నవంబర్ 1, 2, 3 తేదీల్లో పంజాబ్లో వరుసగా 1,921, 1,668, 1,551 పంట వ్యర్థాల దహనం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అదే సమయంలో హర్యానాలో మూడు రోజుల్లో కేవలం 99, 48, 28 కేసులు గుర్తించామన్నారు. ‘మేం (అరవింద్) కేజ్రీవాల్, భగవంత్ మాన్ నుంచి నీటిని డిమాండ్ చేశాం. పొలాల్లో మండించిన పొగను కాదు’ అని ఎద్దేవా చేశారు.
కాగా, హర్యానా వ్యవసాయ మంత్రి జై ప్రకాష్ దలాల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ ప్రతినిధి నీల్ గార్గ్ విమర్శించారు. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో 20 జిల్లాలు హర్యానాలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. పంజాబ్లోని మన్ ప్రభుత్వం వ్యవసాయ వ్యర్థాలు మండించడాన్ని తగ్గించేందుకు రైతులకు యంత్రాలు అందించిందని తెలిపారు. ‘మరి ఖట్టర్ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం మాత్రమే’ అంటూ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వచ్చే పొగ దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి దారి తీస్తున్నది.