(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ): చిరుతలకు మనదేశం ఆవాసం కాదు.. అవి ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో సమృద్ధిగా ఉంటాయి. అక్కడి నుంచి భారత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విమానాల్లో తీసుకొచ్చి ఎంతో జాగ్రత్తగా సాదుతున్నది. కానీ, ఠీవికి పర్యాయ పదంగా ఉండే ఆసియా సింహాలకు భారత గడ్డ జన్మస్థానం.. కేంద్రంలో దశబ్దాలుగా పాలన సాగించిన, సాగిస్తున్న ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించటంతో వాటి మనుగడ ప్రమాదంలో పడింది. ఒకప్పుడు దేశమంతా కనిపించిన ఆసియా సింహాలు, నేడు గుజరాత్లోని గిర్ అభయారణ్యానికే పరిమితమయ్యాయి. అంతరించి పోతున్న జంతువుల జాబితాలో చేరిన వీటిని కాపాడాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రంలో చలనం కనిపించటంలేదు. ఎక్కడో ఉన్న చిరుతలను తీసుకొచ్చి నానా హంగామా, ఆర్భాటం చేయటంపై ఉన్న ఆసక్తి, భారతదేశ గొప్పతనానికి ప్రతీకలైన సింహాలపై కనిపించటంలేదని వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అనాథలుగా మన సింహాలు
మనదేశంలో ఆసియా సింహాలకు చిట్టచివరి ఆవాసం గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కు. ఇక్కడ వాటి సంఖ్య పెరిగిపోవటం, అడవి తక్కువగా ఉండటంతో సింహాల మనుగడ ప్రమాదంలో పడింది. రెండేండ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు అనేక సింహాలు చనిపోయి వరద నీటిలో కొట్టుకురావటం గిర్లో సింహాల దుస్థితికి అద్దం పట్టింది. గుంపులు గుంపులుగా తిరిగే సంఘ జీవులైన సింహాలకు సువిశాలమైన అడవి అవసరం. ఒక ప్రైడ్ (గుంపు) కనీసం 20 చదరపు కిలోమీటర్ల సొంత ఆవాసాన్ని కలిగి ఉంటుంది. కనీసం 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేటాడుతుంది. 2015 లెక్కల ప్రకారం గిర్లో 109 మగ సింహాలు, 201 ఆడ సింహాలు, 213 పిల్లలు ఉన్నాయి. 1965లో రక్షిత అడవిగా ప్రకటించిన గిర్ విస్తీర్ణం 1,412 చదరపు కిలోమీటర్ల మాత్రమే. అందులోనూ అనేక ప్రాంతాల్లో రక్షిత అడవిలో మానవ ఆవాసాలున్నాయి. గిర్లో ఏటా వరదలు సాధారణమయ్యాయి.
ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం
గిర్ నేషనల్ పార్కులో సింహాలకు ప్రమాదం పొంచి ఉండటంతో వాటిని మధ్యప్రదేశ్లోని కునో అభయారణ్యంలోకి తరలించాలని 1994లో ప్రతిపాదన వచ్చింది. అక్కడి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను తరలించడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తరువాత గుజరాత్లో మారిన రాజకీయాల కారణంగా ఆ పథకం అటకెక్కింది. 2000 ఏడాదిలో ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. 2013లో కోర్టు ఆరు నెలల్లోగా గిర్ అడవుల్లోని సింహాలను కునోకు తరలించాలని ఆదేశించింది. దాంతో గుజరాత్ సర్కారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. అయినా సింహాల తరలించే ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రధాని మోదీ గుజరాత్ నుంచి సింహాలను తరలించేందుకు సానుకూలంగా లేకపోవడంతో ఆ పథకం అమలుపై అధికారులు శ్రద్ధ చూపలేదనే ఆరోపణలున్నాయి.