న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ట్విట్టర్ అకౌంట్ లాక్ అయింది. ట్విట్టర్ ప్లాట్ఫామ్పై వార్తల్ని పోస్టుచేసేందుకు కనీస వయసు ఉండాలనే నిబంధనను ఏఎన్ఐ అనుసరించలేదని పేర్కొంటూ అకౌంట్ను ట్విట్టర్ యాజమాన్యం లాక్ చేసింది. సెర్చ్ చేస్తే ఈ అకౌంట్ ప్రస్తుతం మనుగడలో లేదని చూపిస్తున్నది.
ట్విట్టర్ తమకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్ను ఆ సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాశ్ శనివారం షేర్ చేశారు.‘కనీసం 13 ఏండ్ల వయసు ఉండాలనే నిబంధనను చూపిస్తూ అకౌంట్ను లాక్ చేశారు. గోల్డ్ టిక్ను తీసేశారు. దాన్ని బ్లూ టిక్తో భర్తీ చేశారు. ప్రస్తుతం లాక్ చేశారు’ అని అందులో పేర్కొన్నారు. ఎన్డీటీవీ ట్విట్టర్ అకౌంట్ సైతం లాక్ అయింది. దీనిపై ఆ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.