న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదంతో పాటు మతపరంగా ఓటర్లలో చీలిక తీసుకురావడం వల్లే కాషాయ పార్టీ విజయం సాధించిందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు. యూపీతో పాటు దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యం ప్రతి ఒక్కరికీ తెలుసని అయితే ప్రచార ఆర్భాటంతో కాషాయ పార్టీ ప్రజల మైండ్సెట్ను మార్చివేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఐటీ, ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాషాయ పాలకులు పబ్బం గడుపుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు.
దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలతో దేశవ్యాప్తంగా దాడులు ఎలా చేయిస్తున్నారనేది ప్రపంచం చూస్తోందని చెప్పారు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరవేస్తే బీజేపీ నిజస్వరూపం వెల్లడవుతుందని అన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండబోదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రకటన నేపధ్యంలో గెహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె కూడా హైకమాండ్కు బాసటగా నిలిచారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేపధ్యంలో ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ ఆశించిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు పొందడంలో తాము విఫలమయ్యామని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఫలితాలపై సమీక్షించేందుకు త్వరలో వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారని సుర్జీవాలా తెలిపారు. ఇక ప్రజా తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఓటమి నుంచి తాము పాఠాలు నేర్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.