Ashneer Grover | న్యూఢిల్లీ, నవంబర్ 13: భారత్లో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) లెక్కింపు విధానంపై ప్రముఖ ఆంత్రప్రెన్యూర్, భారత్పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో జీడీపీని లెక్కిస్తున్న తీరును ఆయన వ్యతిరేకించారు. తలసరి ఆదాయం ఆధారంగా జీడీపీని లెక్కించాల్సిన అవసరం ఉన్నదని, అదే అభివృద్ధికి అసలైన సూచిక అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ నెటిజన్ పోస్టుకు స్పందనగా తాజాగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాల కర్బన ఉద్గారాల్లో చైనా అతిపెద్ద కాలుష్యకారిగా ఉన్నదని, అమెరికా కంటే ముందు వరుసలో ఉన్నదంటూ వచ్చిన ఓ నివేదికపై మోహన్పాయ్ అనే నెటిజన్ స్పందించారు.
కర్బన ఉద్గారాల అంశాన్ని జనాభా పరంగా చూడాల్సిన అవసరం ఉన్నదని, చైనా జనాభా అమెరికా కంటే నాలుగు రెట్లు అని, అమెరికా తలసరి కర్బన ఉద్గారం చైనాలో 45 శాతం మాత్రమే ఉన్నదని అతను తన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై అశ్నీర్ గ్రోవర్ స్పందిస్తూ.. ‘కచ్చితంగా ఇది సరైనది. సరైన పారామీటర్లను ట్రాక్ చేయడం చాలా కీలకం. అదేవిధంగా, మన భారతదేశ జీడీపీని కూడా తలసరి ఆదాయం పరంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో 3వ లేదా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని గుడ్డిగా సంబురాలు జరుపుకోవడం కాదు.. తలసరి ఆదాయానికి సంబంధించిన చార్టుల్లో పైకి ఎగబాకడమే అభివృద్ధికి సరైన సూచిక, సరైన గణన అవుతుంది’ అని తన పోస్టులో రాశారు.
జీడీపీ అంశంపై అశ్నీర్ గ్రోవర్ ఎక్స్ పోస్టుపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు ఇచ్చారు. చాలా మంది గ్రోవర్ అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రభుత్వాలు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. చాలా మంది గ్రోవర్ పోస్టును తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఆయన పోస్టుకు ఏకంగా నాలుగు లక్షల వ్యూస్లు, 5 వేలకు పైగా లైక్లు వచ్చాయి. గ్రోవర్ అభిప్రాయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘అవును.. జీడీపీ పరంగా నేడు భారత్ 5వ ర్యాంకులో ఉన్నది. అది మనల్ని గర్వపడేలా చేయొచ్చు. కానీ తలసరి ఆదాయం పరంగా చూస్తే మన దేశ ర్యాంకు 128గా ఉన్నది’ అని పేర్కొన్నారు. మెరుగైన తలసరి ఆదాయం, పౌరులకు ఆరోగ్యం, నాణ్యమైన జీవన ప్రమాణాలు, మానసిక క్షేమం, సంతోషం వంటివి లేకుండా.. జీడీపీలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ వ్యర్థమేనని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ‘మనం లెక్కించాల్సింది తలసరి ఆదాయాన్ని.. జీడీపీని కాదు. తలసరి ఆదాయమే కుటుంబ ఆదాయ పెరుగుదలను సూచిస్తుంది’ అని మరొకరు పేర్కొన్నారు. కొంత మంది నెటిజర్లు గ్రోవర్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.
తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014-15లో రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం అనంతర కాలంలో సీఎం కేసీఆర్ పాలనలో 2022-23 నాటికి ఏకంగా రూ.3,08,732కి ఎగబాకింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలో అనూహ్య వృద్ధి సాధించిన కొత్త రాష్ట్రం తెలంగాణ.. జీఎస్డీపీలో మూడు రెట్లు వృద్ధి సాధించింది. తలసరి ఆదాయంలోనూ నంబర్ వన్గా నిలిచింది. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104. అప్పటికి తెలంగాణ స్థానం 10. కానీ అనతికాలంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ ఇతర పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి 2022-23 నాటికి రూ.3,08,732తో అగ్రస్థానానికి ఎగబాకింది. తలసరి ఆదాయం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత చాలా రాష్ర్టాలు తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి.