అయోధ్య: బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. గత 500 ఏండ్లలో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా అని వీచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ (Vinod Bansal) ప్రశ్నించారు. అసదుద్దీన్ లండన్లో బారిస్టర్ చదివారని, మసీదు కాపాడేందుకు ఎందుకు కోర్టుకు వెళ్లలేదన నిలదీశారు. ఇది ముమ్మాటికీ రాజకీయమేనని తెలిపారు. ఒవైసీ త్వరలో రామ భక్తులుగా మారుతారని, ఆయన రామ నామ స్మరణ చేస్తారని సెటైర్ వేశారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ కర్ణాటకలోని కలబురగిలో మీడియాతో మాట్లాడారు. అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదును కూల్చకుంటే.. ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదన్నారు. బాబ్రీ మసీదులో ముస్లింలు 500 ఏండ్లకు పైగా నమాజ్ చేశారని, యూపీ సీఎంగా జీబీ పంత్ ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలను ఉంచారని పేర్కొన్నారు. అయోధ్య కలెక్టర్గా ఉన్న నాయర్ మసీదును మూసివేసి, అక్కడ పూజలు ప్రారంభించారని ఒవైసీ అన్నారు. రామ మందిరం గురించి మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదని, ఒక క్రమ పద్ధతిలో బాబ్రీ మసీదును భారతీయ ముస్లింల నుంచి లాగేసుకొన్నారని పేర్కొన్నారు.