భోపాల్: భయ్యా మీరెక్కడికి వెళ్లొద్దు.. మామా మీరెక్కడికి వెళ్లకండి అంటూ.. మహిళలు, అమ్మాయిలు.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను పట్టుకుని ఏడ్చేశారు. ఈ ఘటన విదిషా నియోజకవర్గంలో జరిగింది. ఆ స్థానం నుంచి ఆయన గతంలో పోటీ చేసి గెలిచారు. మహిళల కోసం ఎన్నో స్కీమ్లను అమలు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల.. సీఎం పోస్టుకు దూరం అయ్యారు. అయితే విదిషాలో టూర్ చేస్తున్న సమయంలో.. ఆయన్ను అక్కడి మహిళలు భావోద్వేగంతో హత్తుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్లవద్దు అంటూ ఏడ్చేశారు.
Emotional Moment for people on Shivraj Singh Chouhan’s departure. pic.twitter.com/158te7zrcc
— 💪🎭..Rai ji..💪🎭 (@Vinod_r108) December 12, 2023
శివరాజ్ సింగ్కు సీఎం పదవి ఇవ్వకుండా.. బీజేపీ అధిష్టానం ఆ పోస్టుకు మోహన్ యాదవ్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే శివరాజ్ను కేంద్ర సర్కార్లోకి తీసుకునే యోచనలో బీజేపీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానిక మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. ఏడుస్తున్న మహిళల్ని శివరాజ్ సింగ్ చౌహాన్ ఓదార్చారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని ఆ మహిళలకు నచ్చజెప్పారు.
నవంబర్ 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలు నెగ్గి అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఉజ్జెయిన్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ను సీఎంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈసారి చౌహాన్ .. బుద్నీ స్థానం నుంచి లక్ష మెజారిటీతో గెలుపొందారు. లాడ్లీ బెహనా లాంటి స్కీమ్లను శివరాజ్ ప్రవేశపెట్టారు. 18 ఏళ్ల పాటు ఆయన సీఎంగా చేశారు. చత్తీస్ఘడ్ బీజేపీ సీఎం రమణ్ సింగ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు.